Recent News

తెలుగు, తెనుగు, ఆంధ్రము

తెలుగు, తెనుగు, ఆంధ్రము

ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. [4][5] క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [6].
క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.
ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు
శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.

చరిత్ర

అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది[3].
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:
అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

తెలుగు -ఒక అవలోకనం

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?
భాషా శాస్త్రకారులు తెలుగును[1]ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు. అనగా తెలుగు హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకుతమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, బ్రహుయి మొదలగు భాషలతోపాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందును. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు సవర, గొండి, కుయి, కోయ, కొలమి కూడ ఉన్నాయి[2]. మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా,
తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాషా, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.
తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. సంస్కృతము చూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా మహాప్రాణ (aspirated) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ కోస్తా ప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఇక్కడి పండితులను పొరుగు రాష్ట్రాల వారు వైదిక కర్మలను జరపడానికి ప్రత్యేకంగా పిలుచుకొని వెళ్ళేవారు అని ప్రతీతి. తెలుగుకి, సంస్కృతమునకు చాలా దగ్గర సంబంధం ఉండడం వలన వారి ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇప్పటికీ తెలుగు భాషలో సంస్కృత పదములను మనం గమనించవఛ్ఛు. సంస్కృత భాషా ప్రభావం భారత దేశ భాషలన్నింటి మీద ఉంది. కానీ తెలుగు భాషని గమనిస్తే, తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉచ్చారణ, భావం సంస్కృతం ను తలపిస్తాయి.
సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (జెనెటిక్) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడములో ఆశ్చర్యము లేదు.
తెలుగువారికి ఆంగ్లము అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీ ఇంగ్లీషు నందు మాత్రము కర్త-క్రియ-కర్మ గా వస్తాయి. ఆంగ్లము మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి.
భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పిలుచుకున్నారు.
తెలుగు (మరియూ ఇతర భారతదేశ బాషలలోని) ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.

రాయల తెలుగు చరిత్ర

తెలుగు

తెలుగు, భారత దేశము లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని పక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలోని భాషలలో అత్యధికముగా మాట్లాడు భాషలు వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశము మాతృభాషలలో రె0డవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.



తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారము
తెలుగు
మాట్లాడే దేశాలు: భారతదేశం 
ప్రాంతం: ఆంధ్ర ప్రదేశ్ (అధికార భాష)
మాట్లాడేవారి సంఖ్య: 8.3కోట్లు (మాతృభాష), 9.32కోట్లు మొత్తం (రెండవ భాషగా మాట్లాడే ప్రజలతో సహా) 
ర్యాంకు: 13 (మాతృభాష)
భాషా కుటుంబము: ద్రవిడ
 దక్షిణ-మధ్య
  తెలుగు 
వ్రాసే పద్ధతి: తెలుగు లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: Flag of భారత దేశం భారత్
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు








ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

 

Recent Comments | Recent Posts


Bloggerized by : GosuBlogger | designed by: Website Builder | Coded by: Blog Directory | Provided by: Wedding photojournalism chicago
bottom